చిట్కుల్ (కబుర్లు టుడే) ఆగస్టు 04
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ఆషాఢ మాస బోనాల పండుగ, దుర్గమ్మ జాతర మహోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో, వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి.
మన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో, వైభవంగా ప్రారంభమైంది. గ్రామ దేవతల అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ఊరంతా ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రతి ఇల్లూ పసుపు, కుంకుమలు, తోరణాలతో శోభాయమానంగా మారింది.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే దుర్గమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నీలం మధు ముదిరాజ్ భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నాలుగు రోజుల ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా మొదటిరోజు మంగళవారం గ్రామం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. కట్టమైసమ్మ జాతరతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని, గ్రామ దేవత కట్టమైసమ్మ తల్లికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి, మంగళహారతులు పట్టి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
రెండవ రోజైన బుధవారం దుర్గమ్మ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పిస్తున్నారు. మూడవ రోజు గురువారం పోచమ్మ జాతర జరగనుంది. ఈ రోజున గ్రామ ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి, తమ కష్టాలను తీర్చి కుటుంబాలను చల్లగా చూడాలని ఆ వేడుకల ద్వారా అమ్మవారిని ప్రార్థించనున్నారు.
ఉత్సవాల్లో నాల్గవ రోజు శుక్రవారం దుర్గమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా జరగనుంది. గ్రామ ఆడపడుచులు ఆధ్యాత్మిక నిష్టతో, భక్తిప్రపత్తులతో బోనాలను శిరస్సున ధరించి, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ ఆలయానికి చేరుకోనున్నారు. బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందనున్నారు.
ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి పటాన్చెరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించే ఈ ఉత్సవాలలో భక్తులందరూ విశేషంగా పాల్గొని, అమ్మవార్ల దివ్య ఆశీస్సులు పొంది, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



